2018- 19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ పనుల పాత బకాయిలను చెల్లించాలని, అలాగే ఆ బకాయిలు చెల్లించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేసిన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ కోరారు. వైసిపి ప్రభుత్వం 2019 -24 మధ్యకాలంలో రాజకీయ కక్షతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చట్ట వ్యతిరేకంగా నిలిపివేసిన చెల్లింపులు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈనాటికి అమలు కానీ విషయాలు పరిష్కారం కోసం మీ ముందు ఉంచుతున్నాము:
1) అధికారంలోకి వచ్చిన వెంటనే 2018 19 సంవత్సరంలో తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలు ద్వారా చేసిన పనులు అన్నింటికీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను విడుదల చేయకుండా గత ప్రభుత్వం మెమో నెం.1202/విజిలెన్స్ 1/2020-4, డేట్:05.05.2020 ద్వారా నిలుపుదల చేస్తూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
2) ఎప్పటికే ఈ పనులు అన్నింటిని ఇంజనీరింగ్ అధికారులు ఎం బుక్ రికార్డు చేయడం, చెక్ మెజర్మెంట్ చేయడం, క్వాలిటీ కంట్రోల్ నిర్వహించడం మరియు సోషల్ ఆడిటర్ నిర్వహణ జరిపి ఎఫ్డిఓ లను చెల్లింపుల కోసం పంపించడం జరిగింది. ఆ దశలో మళ్లీ విజిలెన్స్ పేరిట అక్రమంగా బిల్లులు నిలుపుదల చేశారు. దీనిపై అనేక వందల కేసులు హైకోర్టులో దాఖలు అయ్యాయి.
3) దీనిపై పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మెమో నెంబర్.1263069/ RD.H/A1/2020, డేట్ 05 .11 .2020 ద్వారా రూ,,5 లక్షల లోపు విలువ ఉన్న 7 ,95, 494 పనులలో కేవలం 11, 918 పనులను పరిశీలించామని వాటిలో జిల్లా కమిటీ పనులకు 21.02 శాతం మరియు మండల కమిటీ పనులకు 6.33 శాతం తగ్గించి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అన్ని రకముల సర్టిఫికేషన్ జరిగిన తరువాత ఆ తగ్గింపులకు అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు .ఆ మేరకు కూడా చెల్లింపులు జరపలేదు.
4) ఆ తదుపరి పంచాయతీరాజ్ శాఖ వారు 12 .05 .2021న మరొక మెమోనిస్తూ రూ. 5 లక్షల విలువకు మించిన పనులకు కూడా ఇదే కోతను నిర్దేశిస్తూ చెల్లింపులు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలపాటు అనేక వందల కేసులు హైకోర్టులో (కోర్టు ధిక్కార కేసులతో సహా) వేసిన తరువాత మాత్రమే దఫా దఫాలుగా కొన్ని పనులకు నిధులు విడుదల చేశారు.
5) సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత కోతను విధిస్తూ జారీ చేసిన పై రెండు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు కక్ష దారులు వెళ్ళగా రీట్ పిటీషన్ నెంబర్ 724 / 2021 లో 12. 10 .2023 తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ క్రింది ఆదేశాలను ఇచ్చింది.
a) నిలుపుదల చేసిన 2018 -19 సంవత్సరానికి సంబంధించిన అన్ని పనులకు కోత విధిస్తూ చేయవలసిన అన్ని చెల్లింపులు ఈ ఆర్డర్ తేదీ నుండి ఒక నెలలోగా తప్పనిసరిగా చెల్లించాలి.
b) ప్రభుత్వం ఈ ఆర్డర్ తేదీ నుండి నాలుగు నెలలలో ఆ పనులపై పునర్ విచారణ జరిపి కోత విధించవలసిన అవసరం ఉన్నది లేనిది సంబంధిత వ్యక్తులకు తమ వాదనను వినిపించుకునే అవకాశం ఇస్తూ విచారణ పూర్తి చేయాలని, ఆ పనులలో లోపాలు లేవని గుర్తించినట్లయితే కోత విధించిన మొత్తాలను మరియు మొత్తం బిల్లుపై 6 శాతం అపరాధపు వడ్డీని పనిచేసిన వారికి చెల్లించాలని ఆదేశించింది.
c) 01.10.2018 ముందుకు సంబంధించిన పనులకు ఇంకా చెల్లింపులు జరపకపోతే ఆ మొత్తాలను కూడా ఆరు శాతం అపరాధకు వడ్డీతో సహా ఈ ఆర్డర్ తేదీ నుండి ఒక నెలలో చెల్లించాలని నిర్దేశించింది.
6) రాజకీయ కక్షతో ఐదు సంవత్సరముల పాటు లక్షల మంది సర్పంచులను, పనిచేసిన సంస్థలను నిధులు విడుదల చేయకుండా సంక్షోభంలో పడవేసిన వైసిపి ప్రభుత్వం హైకోర్టు వారు ఇచ్చిన ఈ ఉత్తర్వులను కూడా చివరి వరకు పాటించలేదు.
7) గత ఐదు సంవత్సరాలలో ఈ పనులకు ఆర్థిక వనరులు చేకూర్చిన కొంతమంది వ్యక్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వేల కొద్ది కేసులు హైకోర్టులో వేసి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తో బాటు సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ తదితరులు ఉన్నారు.