గత డిశంబరు 27 నుండి 29 వరకూ ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్నచర్యలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సిఎస్ ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ముఖ్యంగా భూమి, ఆస్తులు,విద్యుత్,తాగునీరు,వైద్య ఆరోగ్యం,విద్యా శాఖలకు సంబంధించి సిఎస్ ల సమావేంలో చర్చించిన ధీమ్ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్ కు సమర్పించాల్సి ఉందని కావున త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూలై మాసంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నందని ఆసమావేశంలో గత సిఎస్ ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్నచర్యలపై సమీక్షించనున్నారని పేర్కొన్నారు. ఐదు విభాగాలకు సంబంధించి 117 యాక్సనబుల్ పాయింట్స్ పై ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.
కాగా ఇప్పటి వరకూ 43 అంశాలపై చర్యలు తీసుకోగా,మరో 60 అంశాలకు సంబంధించి చర్యలు ప్రారంభించారని,17 అంశలాపై ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని,7 అంశాలపై ఆయా శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేగాక ఐటి మరియు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్సుకు సంబంధించి 28 అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
అంతకు ముందు పలు అంశాలపై చర్చిస్తూ ముఖ్యంగా తాగునీటికి సంబంధించి పాఠ్యాంశాలల్లో ఒక ప్రత్యేక చాప్టర్ ను పెట్టాల్సిన అవసరం ఉందని దానివల్ల విద్యార్ధులతో పాటు ప్రతి ఒక్కరికీ తాగునీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ఏర్పడి నీటిని పొదుపు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.అదే విధంగా తాగునీటి సోర్సులను జియో ట్యాంగింగ్ తో అనుసంధానం చేసే అంశంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పగటి సమయంలో సోలార్ విద్యుత్ తో వివిధ సింగిల్ విలేజ్ తదితర రక్షిత మంచినీటి సరపరా పధకాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలుగా తగిన కార్యాచరణ చర్యలు తీసుకోవాలని రక్షిత మంచినీటి సరఫరా మరియు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ సమాజం నుండి క్షయ,టిబి,బోధకాలు వ్యాధులను పూర్తిగా రూపుమాపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత శాఖల వారీగా అంశాల్లో తీసుకున్న,తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ఈసమావేశానికి ఇంధన,వైద్య ఆరోగ్య,వ్యవసాయ, ఆర్ధిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్, యం.టి.కృష్ణబాబు,గోపాల కృష్ణ ద్వివేది,ఎస్ఎస్ రావత్,జల వనరులు,పిఆర్ అండ్ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఐటి శాఖ కార్యదర్శి కె.శశిధర్ తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.అలాగే ఈసమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.