చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పల్నాడు జిల్లా నుంచి ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఏడుకు ఏడు టిడిపి గెలిచింది. గెలిచిన ఏడుగురు టిడిపి ఎమ్మెల్యేల్లో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా వీరెవరికి మంత్రివర్గంలో సీటు లభించలేదు. సత్తెనపల్లి నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు కాపు కోటాలో బెర్త్ లభిస్తుందని భావించినా ఆయనకు అవకాశం లభించలేదు. మూడుసార్లు గెలిచిన వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఐదుసార్లు గెలిచిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు కూడా స్థానం దొరకలేదు.
వెనుకబడిన పల్నాడు జిల్లా నుంచి ఎవరికైనా స్థానం కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టిడిపి గెలిచిన ప్రతిసారీ ఇక్కడ నుంచి ఎవరో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునేది. కానీ ఈసారి అలా చేయలేదు. గత జగన్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి అంబటి రాంబాబుకు స్థానం కల్పించింది. అయితే ఇప్పుడు టిడిపి ప్రభుత్వం మాత్రం ఇక్కడ నుంచి ఎవరినీ పరిశీలించలేదు. మొత్తం ఏడు సీట్లలో గెలిచిన వారిలో నలుగురు కమ్మ వర్గానికి చెందిన వారు ఉండగా, ఇద్దరు కాపు, ఒకరు రెడ్డి వర్గానికి చెందిన వారు ఉన్నారు. గెలిచిన నలుగురు కమ్మల్లో ముగ్గురు అత్యంత సీనియర్లు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు కమ్మలకు స్థానం కల్పించడంతో ఇక ఇక్కడ నుంచి ఎవరికీ అవకాశం దొరకలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.