సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు రావడంతో ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి విరామం ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే మన్ కీ బాత్ పున: ప్రారంభిస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు చెప్పినట్లు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి ఎపిసోడ్ను మొత్తంగా 111వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మొదట ఎన్డీయే కూటమికి ఘన విజయాన్ని అందించిన దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అలాగే ప్రధాని మోదీ మన్ కీ బాత్లో తన తల్లి హీరాబాను గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన మిత్రులారా ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే, మీరు ఖచ్చితంగా ‘అమ్మా’ అని సమాధానం చెబుతారు. మనందరి జీవితంలో ‘అమ్మ’కి అత్యున్నత స్థానం ఉందంటూ తన తల్లిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తల్లితో కలిసి లేదా ఆమె పేరుతో ఒక మొక్క నాటాలని దేశ ప్రజలను మోదీ కోరారు. అమ్మ పేరుతో ఒక చెట్టు ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టారు. తాను తన అమ్మ పేరుతో మొక్క నాటానని చెప్పారు. అమ్మ పేరుతో మొక్కలు నాటడం ద్వారా తల్లిని గౌరవించడంతో పాటు మాతృభూమిని కాపాడుకోవచ్చన్నారు.