జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులలో భాగస్వామ్యం ఉన్న మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నాలుక మడతపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైందని ఆ పాలనపై తానిప్పుడే విమర్శలు చేయబోనని అన్నారు. ఇదే సమయంలో రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వటం మంచిదేనని తెలిపారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసే శక్తి వారికి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాలపై బొత్స స్పందించారు. వీసీ ల రాజీనామాలను ప్రభుత్వం కోరటం తప్పు కాదన్నారు. వైసీపీ కార్యాలయాల్లోకి కూటమి నేతలు చొరబడితే తప్పు అంటున్నానని అన్నారు.
గతంలో టీడీపీ ఆఫీస్పై తమ పార్టీ నేతలు చేసిన దాడి కూడా తప్పు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉభయ పక్షాల వారు సంయమనం పాటించాలని బొత్స విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టం కంటే జగన్ పాలన వల్లే నష్టం ఎక్కువైందని అంటున్నారని.. ఎప్పుడు నష్టం జరిగింది? ఎప్పుడు లాభం జరిగిందనేది లెక్కల్లో తేలుతుందని చెప్పారు. ఇక తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. నిజాలు నిలకడగా తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఓటమిపై స్పందించిన బొత్స.. ప్రజలను తమను అంగీకరించలేదు కాబట్టే తాము ఓడిపోయామన్నారు.