ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అనుమతులు లేవంటూ ప్రజా వేదికను కూల్చివేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేని కట్టడాలను కూల్చివేస్తామని ప్రకటించి అక్రమ కట్టడాల పేరిట ప్రతిపక్ష నేతలకీ చెందిన కట్టడాలు కూల్చివేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వైకాపా కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారని,మరి ఆనాడు చెప్పిన మాటలు నిబంధనలు మీ వైకాపా భవనాలకు వర్తించవా ..? మరి మీరు చెప్పినట్టు ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలి కదా అని జగన్ మోహన్ రాజు ప్రశ్నించారు.స్థానిక సంస్థల అధికారులు అనుమతులు లేని భవనాలకు నోటీసులు జారీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారో వైకాపా నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలలో వైకాపా కార్యాలయ భవనాలకు స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆయన అన్నారు.శ్రీకాకుళం,అనకాపల్లి పార్వతిపురం, కాకినాడ రాజమండ్రి, ఏలూరు, విజయవాడ తాడేపల్లి, అన్నమయ్య, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు నంద్యాల, కడప అనంతపురం,పుట్టపర్తి, తిరుపతి లో భవన నిర్మాణ అనుమతుల కోసం కనీసం దరఖాస్తు కూడా చేయలేదన్నారు. విశాఖ,విజయ నగరం, మచిలీపట్నం,కర్నూలులో ఆన్లైన్లో దరఖాస్తులు చేసిన వాటికి ఎలాంటి అనుమతులు రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సాధారణంగా భవన నిర్మాణాలు చేపట్టే ముందు స్థానిక సంస్థల అనుమతులు తీసుకుంటారని కానీ ఇక్కడ వైకాపా ఆ నిబంధన పాటించలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, శవనవారి పల్లె సర్పంచ్ కోటయ్య నాయుడు, సీనియర్ నాయకులు జీవి సుబ్బరాజు, తెలుగు యువత పార్లమెంట్ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.