జగన్ మోహన్ రెడ్డి ఏపీలో దారుణమైన రీతిలో అత్యంత అవమానకరంగా ఓటమి పాలయ్యారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో బిజీగా గడిపిన వ్యక్తికి ఇప్పుడు బాగా ఖాళీ దొరికింది. నిజానికి జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ, తనకు ఆ హోదా కావాలని స్పీకర్ కు లేఖ రాశారు. ఒకవేళ ఆయన వినతిని పరిగణనలోకి తీసుకొని ప్రతిపక్ష హోదా కల్పించారనుకున్నా.. జగన్ రెడ్డి చంద్రబాబును అసెంబ్లీలో ఎదుర్కొనే ధైర్యం చేయలేడనే సంగతి అందరికీ తెలుసు.
ఇక ఇప్పుడు జగన్ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. తాను అధికారంలో ఉండగా.. విపక్ష అధినేతను, టీడీపీ నేతలను పెట్టిన వేధింపులకు ఇప్పుడు జగన్ ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఏపీలో ఎక్కడా ఉండలేని పరిస్థితి జగన్ కు ఉంది. ఆంధ్రాలో తనకు ఇప్పుడు ఉంటున్న తాడేపల్లిలో ఓ ప్యాలెస్, పులివెందులలో మరో ప్యాలెస్ ఉన్నా కూడా ఎక్కడా ఆయన ఉండాలనుకోవడం లేదు. తన భద్రత కోసం ఇప్పటికే ఎంతో మంది సిబ్బందిని నియమించుకున్నారు.
ఆ సంఖ్య వింటేనే సగటు వ్యక్తి కళ్లు తిరుగుతాయి. ఇక ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్, ఫోన్ ట్యాపింగ్ ల భయం జగన్ను మరింతగా వెంటాడుతోంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి హైదరాబాద్లో లోటస్ పాండ్లోని మరో ప్యాలెస్లో ఉంటారని భావించారు. కానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటే అలాగే చేసి ఉండేవారు. ఎందుకంటే కేసీఆర్ తో జగన్ రెడ్డి దోస్తీ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఉండడంతో హైదరాబాద్లో కూడా జగన్ ఉండే సాహసం చేయడం లేదు.
రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. కాబట్టి, రేవంత్ రెడ్డిని జగన్ అంత తేలిగ్గా నమ్మే అవకాశమే లేదు. కాబట్టి, జగన్ బెంగళూరు యలహంకలోని తన ప్యాలెస్కు వెళ్లారు. అయితే, ఆయన అక్కడకు వెళ్లేందుకు కూడా కారణం లేకపోలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. అందులోని పెద్దలు జగన్ కు మిత్రులు. అందుకే బెంగళూరుకి మకాం మార్చాడు. మరో ప్రధాన కారణం.. తన ఫ్యామిలీతో సన్నిహితుడైన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్తో ఉన్న సాన్నిహిత్యంతో బెంగళూరుకి మకాం మార్చారనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ఆయనపై ఫోన్ ట్యాపింగ్, ఇంటెలిజెన్స్ నిఘా భయం కొంతవరకు ఉండబోదని వైసీపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.