వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. గురువారం గోపాల్ పేట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
రైతులు ధాన్యం కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేసి సంచుల్లో నింపాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం వర్షంలో తడవడానికి అవకాశం లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని సైతం టార్పాలిన్ కవర్లతో కప్పాలని, కేంద్రానికి ధాన్యం వచ్చినపుడు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. బరువు కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ఈ సందర్బంగా కలెక్టర్ అక్కడే ఉన్న పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారూ, తరలించిన ధాన్యం తదితర విషయాల్ని ఇంఛార్జిలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేంద్రం ఇంఛార్జిలకు సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీవో ఉసేనప్ప, ఏపీవో నరేందర్, ఏపీఎం చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి బాలరాజు కలెక్టర్ వెంట ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్