వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా పని చేసిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి జోక్యం ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే. అటు పార్టీ పరంగానే కాక, ఇటు ప్రభుత్వంలోని వివిధ శాఖలు అన్నిట్లోనూ సజ్జల జోక్యం ఉండేది. అందుకే ఆయన సకల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత అనునాయుల్లో సజ్జల కూడా ఉండేవారు. కాబట్టి, జగన్ చుట్టూ ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తులదే రాజ్యంగా ఉండేది. వీరు చెప్పిందే జగన్ నమ్మేవారని.. పార్టీలో ఇతర నేతల వాదన వినేవారు కాదనే వాదన కూడా ఉంది. సజ్జలతోపాటు మరో ముగ్గురి మాటలు వినే జగన్ రెడ్డి ఇలా పాతాళానికి పడిపోయారని సొంత పార్టీ నేతలే అంటుంటారు.
అయితే, ప్రభుత్వంలోనూ అంతటి జోక్యం ఉన్న సజ్జల రామక్రిష్ణా రెడ్డి.. చాలా చోట్ల చేతి వాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లో క్వార్ట్జ్ గనుల్లో భారీ దోపిడీ జరిగిందని సీఐడీ అధికారులకు మంగళవారం ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాలోని వైసీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డితో పాటు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ ఈ దోపిడీలో పాత్రధారులని బాధితుడు ఆదూరు బద్రినాథ్ ఆరోపిస్తూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
సైదాపురం మండలం జోగుపల్లిలో తనకున్న 240 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని క్వార్ట్జ్ను అక్రమంగా తవ్వి దోచుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క తన భూమిలోనే రూ.800 కోట్ల విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారని అన్నారు. ఇది అన్యాయమని తాము అన్నందుకు తమపై రౌడీ షీట్లు తెరుస్తామని.. బెదిరించారని బాధితులు వెల్లడించారు. తమ పిల్లల మీద ఆత్మకూరు డీఎస్పీ కేసులు సైతం పెట్టారని వెల్లడించారు. తవ్వకాలు ఆపాలని తాము హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు కూడా తెచ్చుకున్నామని.. అయినా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బద్రీనాథ్ కోరారు.
అయితే, సజ్జల ఏకంగా రూ.800 కోట్ల అక్రమార్జన చేశారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. లక్షల టన్నుల క్వార్జ్ను మార్కెట్లో అక్రమంగా విక్రయించారు. అదూరు శ్రీచరణ్, కృష్ణయ్య అనే వ్యక్తులను అడ్డం పెట్టుకుని కూడా.. అక్రమాలకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు రావడంతో సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఇక కష్ట కాలం మొదలైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.