ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు.
ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవి వర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.