ఆంధ్రోళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్ చేస్తున్నా నష్టం ఏమీ లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని కేసీఆర్ అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చుకుని పాలన సాగించిన కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఈ పరిస్థితులు ఒక లెక్కనా అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉందని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ధైర్య వచనాలు చెప్పారు. కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు సూచనలు చేశారు.