కడప జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ లో ఇంకా మెరుగైన వసతులకై వైద్యులతో ఆర్డీఓ ధర్మచంద్రా రెడ్డి సమాలోచనలు చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు ఆదేశాల మేరకు రిమ్స్ సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిని కడప ఆర్డీఓ ధర్మ చంద్రా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ముందుగా చిన్న పిల్లల ఐసియు, కార్డియాక్ ఐసియు, సర్జికల్ ఐసియు, జనరల్ ఐసియు..లాంటి అన్ని వార్డులను కలియతిరిగి.. అవి ఎలా పనిచేస్తున్నాయో.. అని పరిశీలించారు. ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని.. వైద్యులతో సమాలోచనలు జరిపారు. అలాగే విద్యుత్తు సరఫరాకు సంబంధించి ..250 కేవి, 500 కేవి జనరేటర్ల పరిస్థితి , అలాగే కొత్తగా త్వరలో ఏర్పాటు చేస్తున్న మరో 500 కేవి జనరేటర్లను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకోవాలని ఎస్పీడిసిఎల్ అధికారులు, వైద్యులను ఆదేశించారు. ఆక్సిజెన్ ప్లాంటును, వార్డుల్లో ఆక్సిజెన్ సరఫరా జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు.
అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఇక్కడకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపర్ ఇన్ టెన్ డెంట్ డా.ప్రసాద్, వైద్యులు, ఎస్పీడిసిఎల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.