జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా ప్రజలు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వేశారని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎవరి మీద నైనా కక్ష ఉంటే వారిపై ఎక్కువ దృష్టి పెడతామా?, కృతజ్ఞతా భావం ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెడతామా?? అన్నది ఒక మనిషిగా ఆలోచిస్తే, ఎవరైన కక్ష ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.
కృతజ్ఞతా భావం ఉన్న వారిని కలిసినప్పుడు మాత్రమే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై నున్న కక్షతోనే ప్రజలు కసిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివవచ్చి ఓటు వేశారని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అభిమానం ఉంటే వచ్చి ఓటు వేయరని గుర్తు చేశారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా ఓటు వేయడానికి ఒక్కొక్కరికి 10 సెకండ్ల కంటే ఎక్కువగానే సమయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేటాయించిన పోలింగ్ సమయం సరిపోకపోవడంతో, ఓటర్లు అర్ధరాత్రి వరకు క్యూ లైన్ల లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. విపరీతమైన ఉక్క పోత ఉన్నప్పటికీ, క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పై ఎంత కసితో ఉన్నారో అర్థమవుతుందన్నారు . ట్రైన్ మిస్ అవుతుందని తెలిసినా, ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో క్యూలైన్లలో ఓటర్లు నిలబడ్డారన్నారు.
150 స్థానాల్లో విజయం సాధించనున్న కూటమి
ఫ్రీ పోల్ అంచనాలు ఎక్కువగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి కొంత మేరకు సానుకూలంగా వెలువడినప్పటికీ, పోస్ట్ పోల్ అంచనాల శాంపిల్స్ పరిశీలిస్తే, 150 స్థానాలలో కూటమి విజయం సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కి వచ్చినట్లుగానే ఈసారి కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ లభించే అవకాశం ఉందన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఉడత ఊపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఐ ప్యాక్ సిబ్బంది కూడా వైకాపాకు 60 స్థానాలే వస్తాయని చెప్పారన్నారు. కౌంటింగ్ సజావుగా కొనసాగేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎందుకంటే ఓడిపోబోతున్నామని తెలిసి వైకాపా నేతలు అల్లర్లు చేయాలని చూస్తారన్నారు. చంద్రబాబు నాయుడు పేరిట జూన్ 9వ తేదీన ముహూర్తం మంచిగా ఉంటే, అదే రోజు ఆయన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు జన్మ నక్షత్రం ఆధారంగా ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడే అమరావతిలో ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారేమో నాకు తెలియదని ఎద్దేవా చేశారు.
పెరిగిన ఓటింగ్ శాతం
గత ఎన్నికలతో పోలిస్తే, ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 86.3% ఓటింగ్ నమోదయిందని ఆయన పేర్కొన్నారు. ఒక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని చెప్పారు.
ఎన్నికలకు ముందు 125 స్థానాలలో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడం జరిగిందన్న రఘురామకృష్ణంరాజు, పోలింగ్ అనంతరం కూటమి 160 స్థానాలను గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వచ్చాయన్న దానిపై ఒక అధికారి హేతుబద్ధమైన అంచనాను వేశారని తెలిపారు. ఆ అధికారి పేరు చెప్పనని, చెప్పినా ఈ పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదన్నారు.
రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల 33 లక్షల 45 వేల చిల్లర ఓట్లు పోలయ్యాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇందులో పురుషులు కోటి 64 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళలు కోటి 69 లక్షల మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు 60 లక్షల మంది ఉండగా, వారంతా తమకే ఓటు వేశారని వైకాపా నాయకులు భావిస్తున్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన 60 లక్షల మంది మహిళలలో 50 లక్షల మంది వైకాపా అభ్యర్థులకే ఓటు వేశారని అనుకుందాం… మిగిలిన 10 లక్షల మంది కూటమికి ఓటు వేశారని ఒక అంచనాకు వస్తే, కోటి 69 లక్షల మందిలో 60 లక్షల మందిని మినహాయిస్తే ఇంకా మిగిలిన కోటీ 9 లక్షల మంది మహిళలలో ఎక్కువమంది కూటమికే ఓటు వేశారన్నారు.