ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష వేస్తామని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలలో ఆసుప్రతులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
మే రెండో వారం నుంచి కరోనా సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధమౌతున్నదని ఢిల్లీ హైకోర్టు నేడు ప్రశ్నించింది. సునామీ లాగా కరోనా కేసులు వచ్చి పడుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరతకు సంబంధించిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విపిన్ సాంఘీ, రేఖా పిళ్లై ల బెంచ్ అత్యవసర విచారణ జరిపింది.
ఈ మేరకు ఆక్సిజన్ సరఫరాపై ఆరా తీసింది. మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి, జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి, బాత్రా హాస్పిటల్, సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ల తరపున కేసు వాదించిన న్యాయవాదులు ఆక్సిజన్ కొరతను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఆ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష విధిస్తామని కటువుగా చెప్పారు.