కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈనెల మొదటివారంలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 62 శాతం ఉండగా, ఇప్పుడది సగటున 58 శాతానికి తగ్గింది. గురువారం 49.82 శాతం ఓఆర్ వచ్చింది. విజయవాడలోని సిటీ బస్సుల్లో ఓఆర్ అతి తక్కువగా 40 శాతంగా ఉంది. కరోనా తొలివిడత తగ్గిన తర్వాత రోజుకు సగటున రూ.12-13 కోట్ల వరకు రాబడి ఉండగా, ఇప్పుడది రూ.8-8.5 కోట్లకు పడిపోయింది.
ఆర్టీసీ ఆదాయం సంగతి అటుంచితే సిబ్బందికి కరోనా సోకడం పెరిగిపోయింది. కొవిడ్ బారిన పడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 123 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. మొత్తంగా గతఏడాది నుంచి ఇప్పటి వరకు 105 మంది ఉద్యోగులు కరోనాతో మృతిచెందారు.
తమకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డులు ఇంకా జారీచేయలేదని, దీనివల్ల కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స పొందాల్సి వస్తోందని ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి తెలిపారు. అన్ని సర్వీసుల్లో 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. ఉద్యోగులందరికీ త్వరగా టీకాలు వేసేలా చూడాలని ఎస్డబ్ల్యుఎఫ్ ప్రధాన కార్యదర్శి సుందర్రావు విన్నవించారు.