ఏపీలో జగన్ ఘోర పరాజయం తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. అటు కొద్ది నెలల ముందే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో.. ఏపీలో ఎన్నికలకు ముందు నుంచే జగన్ ఓడిపోతారనే అర్థం వచ్చేలా మీమ్స్ ఎన్నో వచ్చాయి. కేసీఆర్, కేటీఆర్ కు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని మీమ్స్ తయారు చేసేవారు. అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీని మించిన అవమానకర రీతిలో జగన్ పరాజయం పాలయ్యారు.
ఇక ఇప్పుడు అధికారం కోల్పోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అవమానంగా భావించి ప్రజలకు మొహం చూపించేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. అందుకే అప్పుడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. విడిగా వెళ్లి స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు.
జగన్ కాస్త ధైర్యం చేసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. ఇకపై కేసీఆర్ లాగే వ్యవహరిస్తారని అంటున్నారు. కేసీఆర్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు భిన్నంగా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కొంత హడావిడి చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినందున ప్రజల్ని ఓదార్చేందుకు బయలుదేరతానని ప్రకటించారు.
కానీ, అది ఇప్పట్లో అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక నుంచి కొద్ది రోజుల వరకు ప్రజలకు మొహం చూపించకూడదని ఫిక్స్ అయినట్లు కనబడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు పరిమితం అయ్యారు. ఆ మధ్య తుంటి శస్త్ర చికిత్స జరిగాక చాలా రోజులు అక్కడే ఉన్నారు. పార్టీ నేతలు ఎవరైనా కలవాలనుకున్నా.. ఎర్రవల్లికే వెళ్తున్నారు. కానీ, జగన్ రెడ్డి మాత్రం తన ప్యాలెస్ లో ఉండేందుకు బెంగళూరుకు మకాం మార్చారు.
పులివెందులలో ఉంటే అక్కడి పార్టీ శ్రేణుల పోరు పడలేకపోతున్నట్లుగా చిరాకు పడ్డట్లు వార్తలు వచ్చాయి. అందుకే మనశ్శాంతి కోసం బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లారు. జగన్ అక్కడ ఎన్ని రోజులు ఉంటారో పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చాలా రోజులపాటే ఆయన బెంగళూరులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికప్పుడు జగన్ జనాల్లోకి వెళ్తే ఆయనను స్వాగతించడం అటుంచితే ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితులే ఉన్నాయి.
ఇదే జరిగితే పార్టీ మరింత అప్రతిష్టపాలు అవుతుంది. పార్టీ కోసం కార్యక్రమాలు చేపట్టినా ఫెయిల్ అవుతాయోమో అని ఆందోళన జగన్ ను కంగారు పుట్టిస్తోంది. అందుకే కొద్ది కాలంపాటు జనాల్లోకి వెళ్ళడం మానేసి రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.