రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు రోజురోజుకు పెరిగపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు.
కృష్ణ జిల్లా మైలవరం కు చెందిన వడ్రంగి పఠాన్ ఖాదర్ బాషా కుటుంబ పోషణ నిమిత్తం కొందరి వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించడంలో ఆలశ్యం జరగడంతో అప్పు ఇచ్చిన వాళ్లు వత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.
మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకోగా మూడులక్షల పది వేలు చెల్లించినా అప్పు తీరలేదని చెబుతూ మరో మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని కాల్ మనీ వ్యాపారులు డిమాండ్ చేస్తూ వచ్చారు.
మైలవరం కు చెందిన వేముల దుర్గారావు, వేముల వెంకన్న, వేముల రాము, ప్రత్తిపాటి ప్రభాకర్ కలిసి ఖాదర్ పై వత్తిడి తీసుకురావడమే కాకుండా పది మందిలో అతడిని అవమానించారని షిబ్లీ తెలిపారు. అవమానం భరించలేక ఖాదర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన అన్నారు.
అయితే ఖాదర్ ఆత్మహత్యకు సంబంధించిన కేసు నమోదు చేయడం నిందితులను అరెస్టు చేయడంలో స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దాంతో బాధితులు తమ వద్దకు వచ్చి విన్నవించుకున్నారని షిబ్లీ తెలిపారు. వెంటనే తాము కృష్ణ జిల్లా ఎస్పీ గారు రవీంద్ర బాబు దృష్టికి తీసుకుని వెళ్లామని, ఎస్పీ స్పందించి తమ కార్యాలయానికి బాధితులను పిలిపించుకొని జరిగిన విషయాన్ని విని మైలవరం సిఐకి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని షిబ్లీ తెలిపారు. 40 రోజుల నుంచి చర్యలు తీసుకోని పోలీసులు ఎస్ పి ఆదేశాలతో కదిలి కేసు నమోదు చేశారని షిబ్లీ తెలిపారు.
మరణించిన ఖాదర్ కుటుంబానికి సాయం చేయకుండా వేధించిన వారికి ఎస్ ఐ వత్తాసు పలికారని షిబ్లీ ఆరోపించారు. తక్షణమే ఎస్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భార్యా ఇద్దరు పిల్లలు ఉన్న ఖాదర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు.