అధికారం చివరి రోజుల్లో కూడా తన మాట వినని ఐపిఎస్ అధికారులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ఆపలేదు. సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్ (క్యాట్) తీర్పుపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. క్యాట్ తీర్పు నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తారని అనుకుంటున్న నేపథ్యంలో ఇలా అప్పీలుకు వెళ్లడం ఏబీ వెంకటేశ్వరరావును తీవ్ర నిరాశ పరిచి ఉంటుంది.
అయితే సీఎం జగన్ మనస్తత్వం తెలిసిన వారు ఇందులో ఎలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేయడంలేదు. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ఏబీ వెంకటేశ్వరరావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.