ఏపీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం చాంబర్ వద్ద కోలాహలం నెలకొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కొందరు వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు యత్నించారు. శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు సీఎంవో వద్దకు వచ్చారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారికి అనుమతి దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది. శ్రీలక్ష్మి గతంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు. సునీల్ కుమార్ జగన్ ప్రభుత్వం సీఐడీ చీఫ్ గా పనిచేశారు.