పారిశ్రామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశం కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏలూరి రామచంద్రారెడ్డి లాంటి నాయకుడు పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నట్టు పురంధేశ్వరి చెప్పారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి ఎప్పుడూ తగిన గౌరవం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
తనకు పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా తూ.చ. తప్పకుండా పాటిస్తాననిచ్చే ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన విధంగా పనిచేస్తానని ఏలూరి చెప్పారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు వచ్చే 50 ఏళ్లలో దేశాన్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్తాయని ఈ సందర్భంగా ఏలూరి రామచంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
సీనియర్ రాజకీయనేతగా ఉన్న ఏలూరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ బలంగా విన్పించారు. ఫార్మాసూటికల్స్ రంగంలో కీలకంగా ఉన్న రామచంద్రారెడ్డి గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయాల పట్ల కలతగా ఉన్నారు.