ఈ నెల 27న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాలలోని గౌరశెట్టి వెంకటయ్య మైదానంలో జరిగే బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లక్ష మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధికంగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఈరోజు పార్టీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జీలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. మోడీ సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాలపై చర్చించారు. మోదీ సభకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేస్తే సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారని సమావేశానికి హాజరైన పలువురు నాయకులు చెప్పారు.
బండి సంజయ్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రధాని హోదాలో తొలిసారి కరీంనగర్ జిల్లాకు రాబోతున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలకడంతోపాటు సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుండి లక్ష మంది బహిరంగ సభకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగా సుమారు 50 వేల మంది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చే అవకాశం ఉందన్నారు.
సభకు హాజరయ్యే ప్రజలకు నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వద్దని, అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా ఏ నియోజవర్గం నుండి ఎంత మంది ప్రజలు, కార్యకర్తలు సభకు వచ్చే అవకాశం ఉందనే వివరాలను నోట్ చేసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఇంఛార్జీ మీసాల చంద్రయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.