ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ లతో సీఎం జూమ్ సమావేశం జరిగింది. జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్చార్జ్ లు ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలి.
ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలి. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లను సందర్శించాలి అని అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.