34.2 C
Hyderabad
May 10, 2024 12: 53 PM
Slider విజయనగరం

10 లీటర్ల లోపు మద్యంతో పట్టుబడిన వారిపై కేసు ఎత్తివేత

విజయనగరం జిల్లాలో సెబ్ మరియు పోలీసులకు 10 లీటర్ల లోపు మద్యంతో మొదటిసారి పట్టుబడిన నిందితులపై కేసులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్. వెంకటరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో స్పెషల్
ఎన్ఫోర్స్మెంటు బ్యూరో కమీషనరు ఎం.రవి ప్రకాష్ ఉత్తర్వులను జారీ చేసారన్నారు.

ఈ సందర్భంగా సెబ్ అదనపు ఎస్పీ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు సెబ్ పోలీసులు గడచిన మూడేళ్ళ కాల వ్యవధిలో నమోదు చేసి, మొదటిసారి నేరంకు పాల్పడిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే 693 కేసులను తొలగించడం జరిగిందన్నారు. ఇంకనూ 1047 కేసులు దర్యాప్తు దశలోను, కోర్టు విచారణలో ఉన్నట్లుగా గుర్తించామన్నారు.

గుర్తించిన కేసుల్లో నిందితులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నిర్ధేశించిన కాంపౌండింగు ఫీజు చెల్లించినట్లయితే, వారిపై దర్యాప్తులో ఉన్న కేసులు లేదా కోర్టు విచారణలో ఉన్న కేసులను తొలగిస్తామన్నారు. ఇలా తొలగించిన కేసుల్లో నిందితులు జరిమానా చెల్లించినప్పటికీ, నేరం చేసినట్లుగా పరిగణించడం జరగదని స్పష్టం
చేసారు. 10 లీటర్ల లోపు ఐ.ఎం.ఎఫ్.ఎల్.తో మొదటిసారి పట్టుబడితినే వారిపై నమోదైన కేసులను తొలగించుట జరుగుతుందన్నారు.

ఈ తరహా కేసుల్లో డ్యూటీ పెయిడ్ లిక్కరు కేసుల్లో పట్టుబడిన మద్యం విలువకు మూడు రెట్లు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు కేసుల్లో పట్టుబడిన మద్యం విలువకు ఐదు రెట్లు నగదు కాంపౌండింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సెబ్ అదనపు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగం చేసుకోవడం వలన కేవలం కాంపౌండింగు ఫీజును చెల్లించడంతోనే వారిపై నమోదైన కేసును పూర్తిగా తొలగించుకోవచ్చునన్నారు. అంతేకాకుండా, కోర్టు ప్రాసిక్యూషను ఎదుర్కొనకుండాను, న్యాయవాదుల సహకారం లేకుండానే ప్రాధమిక స్థాయిలోనే కేసుల నుండి ఉపశమనం పొందవచ్చునన్నారు.

కావున, అర్హత కలిగిన నిందితులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, సంబంధిత పోలీసులు లేదా సెబ్ వారిని సంప్రదించి, వారిపై నమోదైన కేసులను తొలగించుకొనేందుకు చొరవ చూపాలని సెబ్ అదనపు ఎస్పీ ఎస్.వెంకటరావు కోరారు. జిల్లాలో నాటుసారా, మద్యం అక్రమ రవాణ, గంజాయి నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సమర్ధ వంతంగా పని చేస్తున్నదని, డ్రగ్స్ వినియోగం కలిగే అనర్థాలను ప్రజలకు, విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించేందుకు కళాశాలలు, ముఖ్య కూడళ్ళలో కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

నాటుసారా, గంజాయి, మద్యం, డ్రగ్స్ నియంత్రణకు సమాచారం టోల్ ఫ్రీ నంబరు 14500 అందించాలని ప్రజలకు సెబ్ అదనపు ఎస్పీ ఎస్.వెంకట రావు విజ్ఞప్తి చేసారు.ఈ మీడియా సమావేశంలో విజయనగరం సెబ్ వన్ టౌన్ సీఐ బి. మధు కుమార్ పాల్గొన్నారు.

Related posts

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి

Bhavani

బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మాయావతి మద్దతు

Satyam NEWS

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రార్ధనా మందిరాలు బంద్

Satyam NEWS

Leave a Comment