మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాబుల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. వారంతా టీఎంసీలో చేరనున్నట్లు వెల్లడించారు.
వాట్సాప్ గ్రూప్ను విడిచిపెట్టిన ఐదుగురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీతో విడిపోయే అవకాశం ఉందంటూ సుప్రియో వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. సుప్రియో బీజేపీకి రాజీనామా చేసి, మూడు నెలల క్రితం తృణమూల్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
సుప్రియో మాత్రం బెంగాలీలో ట్వీట్ చేస్తూ.. ‘బీజేపీలో ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు పడిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచారాన్ని పర్యవేక్షించిన జాతీయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ ఈపాటికి కైలాస పర్వతానికి వెళ్లి ఉండేవారు. మిమ్మల్ని వెనుక నుంచి లాగే బెంగాలీ పీతలు దొరకాలంటే, మురళీధర్ లేన్ కి వెళ్లండి.’ అంటూ సుప్రియో కామెంట్ చేశారు.