ఎన్నికల ప్రచారానికి కొంత గ్యాప్ ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ నిన్న మే 6 నుంచి జనాల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. సోమవారం రోజు రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించి స్థానిక అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన మాటల్లో నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. ఇన్నాళ్లుగా తన మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు వారిపైన ఎన్నికల సంఘం వేటు వేస్తుండడంతో జగన్ లో అభద్రతా భావం పెరిగిపోయింది. జగన్ రెడ్డి మాటల్లో బేలతనం కనిపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డీజీపీ సహా, డీఎస్పీలను సైతం ఎన్నికల సంఘం మార్చేస్తుండడం, కొత్త డీజీపీ మరింత మంది ఆఫీసర్లను మార్చే అవకాశాలు మెండుగా ఉండడంతో జగన్ భయపడిపోతున్నారు. తాను ఏరి కోరి నియమించుకున్న ఐపీఎస్ల సహకారం లేకపోవడంతో ఆ కోపాన్ని జగన్ ఈసీపై చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతోందని జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన అధికారులను మార్చేస్తున్నారని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. నిజానికి అధికారులను మార్చితే జగన్ రెడ్డికి కోపం ఎందుకు వస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఏరి కోరి, తన మాట వినే అధికారులను నియమించుకోగా.. వారిని ఈసీ అక్కడి నుంచి లేపేస్తుండడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు.
మరోవైపు, పేదలకు మంచి జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఈసీపై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలను కూడా ఆపేయిస్తున్నారని జగన్ రెడ్డి మాట్లాడారు. పేదలకు మంచి చేస్తున్న జగన్ ఉండకూడదని కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఎన్నికల కోడ్ రాకముందు ఎప్పుడో కొన్ని పథకాలకు బటన్ నొక్కిన డబ్బులు.. అప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా.. సరిగ్గా పోలింగ్కు ముందు వాటిని జమ చేసేలా జగన్ రెడ్డి ప్లాన్ వేశారు. అలా చేస్తే లబ్ధి కలుగుతుందని జగన్ రెడ్డి కుట్ర. కానీ, ఈసీ అందుకు అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత విడుదల చేయాలని సూచించింది. వాస్తవం ఇది కాగా, ఆన్ గోయింగ్ పథకాలను చంద్రబాబు ఆపి వేయిస్తున్నారంటూ జగన్ అర్థం లేని విమర్శలు చేయడం.. ఆయన అభద్రతా భావాన్ని సూచిస్తోంది. పైగా తనను దించేందుకు కుట్ర జరుగుతోందని జగన్ మాట్లాడడం మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
మరోవైపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసలే ప్రజలు ఎన్నో అనుమానాలతో ఉండగా.. జగన్ రెడ్డి మరీ అర్థం లేని మాటలు మాట్లాడారు. మొత్తం రాష్ట్రం నా పొలమే అన్నట్లుగా జగన్ మాట్లాడేశారు. మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకుంటే దానిని సాగుచేసే బాధ్యత జగన్కు జనం ఇచ్చారని.. తాను అమలు చేసిన స్కీములు, మార్పులు, సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాలు వీటినే ఇంటింట విత్తనాలుగా నాటానని వింతగా మాట్లాడారు. ఆ విత్తనాలు ప్రతి ఇంట్లో ఐదేళ్లుగా పెరుగుతూ వస్తుండగా.. మరో 15 ఏళ్లలో వృక్షాలవుతాయని మాట్లాడడం జగన్ రెడ్డి అసమర్థతను తెలియజేస్తోందని జనం అనుకుంటున్నారు.