తెలుగుదేశం పార్టీలో తల వంచని వీరుడులాగా బతికిన కేశినేని నాని దాన్ని కాదని జగన్ వద్దకు చేరి దారుణ పరాభవాన్ని చవి చూశాడు. విజయవాడ పార్లమెంటు సభ్యుడుగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు గెలిచిన కేశినేని నాని ఆ గెలుపు తెలుగుదేశం పార్టీది కాదు, తనది అని భావించాడు. కేవలం తన ప్రతిభవల్లే విజయవాడ నుంచి గెలిచాను అని చెప్పుకున్నాడు.
తెలుగుదేశం పార్టీ నాయకులను కేశినేని నాని తీవ్రంగా అవమానించాడు. తన కుమార్తెకు పదవులు ఇవ్వాలని వత్తిడి తీసుకువచ్చాడు. తెలుగుదేశం పార్టీ మౌనంగా అన్నింటిని భరించింది. చివరకు కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని జగన్ దగ్గరకు వెళ్లాడు. తెలుగుదేశం పార్టీ కేశినేని నాని స్థానంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నాను రంగంలో దించింది. కేశినేని చిన్నాను ఎంతో సులభంగా ఓడించేస్తానని కేశినేని నాని బీరాలు పలికాడు. అయితే కేశినేని నానితో తెలుగుదేశం పార్టీ వీడి ఒక్కరు కూడా వెళ్లలేదు.
అప్పుడే జగన్ కు అర్ధం అయింది. కేశినేని నాని పనికిరాడని. అయినా సరే గత్యంతరం లేని జగన్ కేశినేని నానికి టిక్కెట్ ఇచ్చాడు. ఎన్నికలలో కేశినేని నాని ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన సోదరుడు, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో 2.82 లక్షల భారీ మెజార్టీ తేడాతో ఓటమి చవిచూశారు. దాంతో కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.