దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన మార్కును జాతీయ స్థాయిలో వేశారా?? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలొ పాల్గొన్న ఆయన.. తరువాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాలు పన్నుతూ.. విస్తృత ప్రచారం చేస్తున్నారు.
అణువణువునా కాంగ్రెస్ భావజాలం, అధినాయత్వంపై విధేయత, పార్టీపై అంకిత భావం కలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రంలోనూ 2014 నుంచి తిరిగి అధికారంలోకి వచ్చే వరకూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన అనుసరించిన వ్యూహాలు.. ఎత్తుగడలు, పోరాటాలు.. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని శక్తివంతం చేశాయి. మరీ ముఖ్యంగా ప్రజల కోసం రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి గడపకు తీసుకువెళ్లేందుకు ఆయన చేసిన పాదయాత్ర.. సరికొత్త చరిత్రనే లిఖించింది.
ఆయన శక్తియుక్తులు, వ్యూహ సామర్థ్యంపై బలమైన అంచనాకు వచ్చిన పార్టీ అధినాయకత్వం.. ఒరిస్సా, పంజాబ రాష్ట్రాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ఒరిస్సాలో నాలుగైదు దఫాలుగా ప్రచారం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి.. తాజాగా పంజాబ్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు.
పార్టీ కార్యకర్తలు, నాయకత్వంతో మెరుగైన సమన్వయం, ఎన్నికల నిర్వహణ గాను పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకునిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ను ఏఐసీసీ నియమించింది. ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకునిగా వెళ్లిన భట్టి విక్రమార్క.. మూడు రోజులపాటు స్థానికంగా ప్రచారం చేస్తారు.. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయనున్నారు.