ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఖమ్మం విజయా డెయిరీని ప్రయివేటుపరం చేసే ఆలోచన యాజమాన్యానికి లేదని, పాడి రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని విజయా డెయిరీ డిడి డా. కుమారస్వామి అన్నారు. ప్రయివేటు డెయిరీలకు దీటుగా 1 ఏప్రిల్, 2023 నుండి పాల సేకరణ ధరలు పెంచినట్లు, దీంతో కొంతమంది స్వార్థపరులు ప్రభుత్వ విజయా డెయిరీపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వ విజయా డెయిరీ యాజమాన్యం పాడిరైతుల సొసైటీలను పటిష్ట పరుచుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో విజయా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటుచేసి, ప్రభుత్వ విజయా డెయిరీని బలోపేతం చేసే దిశగా యాజమాన్యం దృష్టి సారించిందని ఆయన అన్నారు.
పాడిరైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో పాటు, ముద్ర లోన్ ల ద్వారా పాడి గేదెలు, రాయితీపై ఔషధాలు, పశుగ్రాసం విత్తనాలు, ఉచిత వైద్య సేవలు, విజయా డెయిరీ సంక్షేమ పథకాలను పాడి రైతులకు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాడి రైతులకు పారదర్శకంగా ఉండటం, లబ్ది చేకూర్చడం కొరకు పాలమిత్ర మొబైల్ యాప్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరి ట్రాన్స్ఫర్ తో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పాల బిల్లులు జమచేయుటకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవాస్తవాల ప్రచారాలను నమ్మవద్దని, పాడిరైతులు ఆందోళన చెందవద్దని విజయా డెయిరీ డిడి స్పష్టం చేశారు.