ప్రజా రాజధాని అమరావతి గొంతుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధించిన మూడు రాజధానుల కత్తి వేలాడుతూనే ఉందని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే ఇందుకు నిదర్శనం అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం మహిళా జెఎసి నాయకురాలు రాయపాటి శైలజ, రైతు జెఎసి నాయకులు కంచర్ల గాంధీ, మహిళా రైతు నాయకురాలు కొమ్మినేని వరలక్ష్మి, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సున్నపు శ్రీనివాసరావులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
2019లో అమరావతే ఆంధ్రుల రాజధాని అని మేనిఫెస్టోలో పెట్టిన వైకాపా పార్టీ 2024లో మళ్లీ అధికారంలోకి వస్తే, విశాఖే రాజధాని అని మానిఫెస్టో లో ప్రకటించటం రాష్ట్రంలో ప్రాంతీయ వాదానికి బహిరంగంగా లైసెన్స్ ఇవ్వటమే అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని విభజించేందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకాడటం లేదన్నారు. అమరావతి ఆంధ్ర ప్రదేశ్ అక్షయపాత్ర అని, ఆర్థిక సంపద అని, దానిని వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలివేటుతో నరికినట్లు, నరక్కొచ్చు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నానన్నారు.
న్యాయస్థానాలు అమరావతి ఒక్కటే రాజధాని అని గడ్డి పెట్టినా, ముఖ్యమంత్రి బుద్ధి మారటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారును గద్దె దింపకపోతే, రాష్ట్ర భవిష్యత్తుకు, మనుగడకు మార్గం ఉండబోదని బాలకోటయ్య హెచ్చరించారు. మహిళా జెఎసి నాయకురాలు రాయపాటి శైలజ మాట్లాడుతూ పిచ్చోడి చేతిలో రాయిలా వైకాపా ఐదేళ్ళ పాలన సాగిందని తెలిపారు. 1600 రోజుల ఉద్యమం చేసినా, ముఖ్యమంత్రి తాను పట్టిన మూడు రాజధానుల కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా పగకు, ప్రతికారానికి ప్రాధాన్శిస్తున్నట్లు చెప్పారు.
రాబోవు ఎన్నికల్లో అమరావతి రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని, వైకాపాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా రైతు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ రాజధాని ఉద్యమంలో 300 పైగా రైతులు అసువులు బాసారని, పండు వెన్నెల లాంటి అమరావతిని చీకట్ల అడవిని చేశారని చెప్పారు. చట్టాల ద్వారా, శాసనాలు ద్వారా ఏర్పడిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి కదిలించ లేరన్నారు.
న్యాయస్థానాలు తమకు అండగా ఉన్నాయని, ఐదేళ్లపాటు ఊవిళ్ళు ఊరినా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పోలేకపోయారని చెప్పారు. వెలగపూడి రైతు కంచర్ల గాంధీ మాట్లాడుతూ వైకాపా అభ్యర్థులు అమరావతిపై ఇప్పటికీ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని తెలిపారు .రాబోకాలంలో వారికి తగిన దేహ శుద్ధి చెస్తామన్నారు. అమరావతి ఒకరి జాగిరు కాదని, ఆల్లి బిల్లు కంపెనీలు అంతకంటే కాదని రైతుల త్యాగాలతో, శాసనాలు, చట్టాలతో ఏర్పడిన ప్రజా రాజధాని అని చెప్పారు.
అమరావతిని ధ్వంసం చేస్తే ,ఏ ప్రభుత్వానికి మనబడి ఉండబోదని తెల్చి చెప్పారు. అమరావతికి రాబోవు చీకట్లు పోయి, వెలుగులు వస్తాయి అని గాంధీ ఆకాంక్షించారు. విలేకరుల సమావేశంలో రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరం శెట్టి నాగేందర్ రావు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు సున్నపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.