జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో మాతా అంబా భవానీ జాతర ఉత్సవాలు రేపటి (శనివారం)నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయానికి రంగులు వేయడం, విద్యుత్ దీపాల అలంకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. 12వ తేదీన ఉదయం పందిరి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాత్రి ప్రభోత్సవం, 13న కలశ పూజ, బిందె సేవ, అనంతరం రథోత్సవం నిర్వహించనున్నారు. 14న అమ్మవారికి పల్లకీ సేవా, ఉరేగింపు ఉంటాయి. 15న రాత్రి అభిషేకంతో ఉత్స వాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ ధనలక్ష్మి తెలిపారు.
జాతరను పురస్కరించుకొని ప్రతీ రోజు వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 14న మూడు బండ్ల గిరిక పోటీలు, రాత్రి నృత్య ప్రదర్శన ఉంటాయి. 15న కుక్కల పరుగుపందెం, 16న సందెరాళ్ల పోటీలు, 17న బండ లాగుడు పోటీలు నిర్వహిం చనున్నారు. విజేతలకు నగదు బహుమతులను అందిం చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.