అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 6 వ రాష్ట్ర మహాసభలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 19,20 తేదీలలో జరుగుతాయని, వాటిని జయప్రదం చేయాలని గోడపత్రికలను ఆవిష్కరించి ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో జరిగిన ప్రచారంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళ కళల కోసం కాదని, ప్రజల కోసమని శ్రమజీవుల చెమట చుక్కలతో, అమరవీరుల త్యాగాలతో, పాట మొలకెత్తిందని తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో దొరల వేట్టి చాకిరికి, దోపిడీకి వ్యతిరేకంగా పాట రూపంలో ప్రజలను ప్రజలను ఐక్యం చేసిందన్నారు. భూమికోసం జరిగిన అనేక పోరాటాలలో శ్రీకాకుళ రైతాంగ పోరాటం, నక్సల్బరీ పోరాటం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటంలో కళలు, సాహిత్యం, పాటలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో పాట కీలకమై ప్రజలను ఐక్యం చేసిందన్నారు. కళలు, సాహిత్యం, కళారంగం నేడు అంగడిలో సరుకైందన్నారు. దోరల గడీలలో కళారంగం బందీ అయిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహా సభలను జరుపుకొని నూతన ఉత్తేజంతో దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై ప్రజలను తిరుగుబాటుకు చైతన్యం చేయాలన్నారు. కవులు, కళాకారులు, కళాభిమానులు, అభ్యుదయ వాదులందరూ పాల్గొని మహా సభలను జయప్రదం చేయాలని పిలువునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు ఎట్టి నరసింహారావు, శికారు శ్రీను, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కామేపల్లి -ఏన్కూరు సబ్ డివిజన్ కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు నాయకులు వరదబోయిన కృష్ణయ్య, రాచబంటి రమేష్, చిర్ర కృష్ణయ్య, రాచబంటి వెంకన్న, వేముల వెంకన్న, రాచబంటి ప్రసాద్, కొల్లిపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.