భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిపివేయాలని, ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ కళాధర్ డిమాండ్ చేశారు.
ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భవానీపురంలోని ఎల్ఐసీ కార్యాలయాల వద్ద మంగళవారం ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయు) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక క్లైమ్లను పరిష్కరించే జీవిత బీమా సంస్థగా రికార్డు సృష్టించిందన్నారు. 1956లో కేవలం రూ.5 కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ నేడు రూ.32లక్షల కోట్ల ఆస్థులు కలిగి, రూ.22లక్షల కోట్ల మూలధనంతో ముందుకు సాగుతుందన్నారు.
అదేవిధంగా ప్రజల నుంచి సేకరించిన సొమ్మును తిరిగి దేశ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం పెట్టుబడులుగా పెడుతూ భద్రత కల్గిస్తుందని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులును అధికంగా రైల్వే, విద్యుత్తు, నీటి ప్రాజెక్టులకు పెట్టుబడులుగా పెడుతుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 49 కోట్ల మంది పాలసీదారులతో పాటు 1.06లక్షలు ఉద్యోగులను కల్గి అత్యంత తక్కువ ఖర్చుతో (3.3శాతం) నిర్వహించబడే అతిపెద్ద సంస్థను నేడు కేంద్రం ప్రైవేటుపరం చేయాలని చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణం ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం వెంటనే నిలిపివేయాలని.. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐఐఈఏ) ఇప్పటికే పిలుపునిచ్చిందని కళాధర్ తెలిపారు.
నిరసన కార్యక్రమంలో ఐసీఈయు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.ఎం.కె.ప్రసాద్, అసిస్టెంట్ ట్రెజరర్ జె.మధుసూధనరావు, బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు జె.హెప్సీబా, ఆర్.వి.శ్రీనివాస్,గుర్రం శ్రీనివాస్, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.