తెలంగాణ ప్రభుత్వం సర్వమత సామరస్యాన్ని పాటిస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వమత సామరస్యాన్ని తెలంగాణ చాటిందని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కేసీఆర్ మొదలుపెట్టారన్నారు.
ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఎనిమిదేళ్లలో వేల కోట్ల ఖర్చు చేసిందన్నారు. రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ, ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 సహాయం షాదీ ముబారక్ పథకం ద్వారా అందజేస్తున్నదన్నారు. ముస్లింలకు ఉన్నత విద్య అందించాలని ప్రభుత్వం మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు.
ఇతర సంక్షేమ పథకాలోను ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి రూ. 40కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 53 కోట్ల గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉర్దూ అకాడమీ నిర్వహణకు రూ. 40కోట్లు కేటాయించినట్లు వివరించారు.
శాంతియుత సమాజం కోసం ముస్లింలు చేస్తున్న ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని మంత్రులుఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లింలు పాల్గొన్నారు.