ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకానికి అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో గోద్రెజ్ కంపెనీ చే ఏర్పాటు తలపెట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి స్థల కేటాయింపు పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాభదాయకంగా ఆయిల్ పామ్ సాగుకు రైతులు మళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో 11,551 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గోద్రెజ్ కంపెనీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ, నర్సరీ, సీడ్ ఉత్పత్తికి స్థల కేటాయింపుకు కోరినట్లు, కొణిజేర్ల మండలంలో స్థల సేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలమైన స్థల విషయమై అధికారులతో చర్చించారు. ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కొణిజేర్ల తహసీల్దార్ సైదులు, కలెక్టరేట్ డిటి రంజిత్, గోద్రెజ్ కంపెనీ జిఎం చావా వెంకటేశ్వరరావు, డిజిఎం హెచ్ ఆర్ నాగ ప్రవీణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.