దివ్యాంగులు తమ పనులు తాము చేసుకోవడానికి ఉపకరణాలు దోహదపడతాయని సమగ్ర శిక్ష జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త దశరధరామిరెడ్డి పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని భవిత సెంటర్ ఆవరణంలో మంగళవారం దివ్యాంగులకు ఉచిత వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దివ్యాంగుల తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు వారి తల్లిదండ్రులు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన భవిత కేంద్రాలకు వారిని క్రమం తప్పక తీసుకురావాలని కోరారు. భవిత సెంటర్లో వారికి ఉచిత విద్యతోపాటు ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఏడాది దివ్యాంగులకు ఉచిత వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారికి పరికరాలు అందిస్తున్నామని సూచించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా సర్వజన ఆసుపత్రి నుంచి నిపుణులైన వైద్యులు హాజరయ్యారు.రాజంపేట సమీప మండలాల నుంచి విచ్చేసిన దివ్యాంగులకు వైకల్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పరికరాలను సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల విద్యా శాఖ అధికారి రఘునాథరాజు, జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిమళ, లైన్స్ క్లబ్ సభ్యులు అబ్దుల్లా,గవర్నమెంట్ డాక్టర్ మాధవ రెడ్డి,రిమ్స్ ఆడియాలజిస్ట్ ఆయేషా తో పాటు వివిధ మండలాల ఐఈ ఆర్పిలు, దివ్యాంగులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.