తన పంచ్ డైలాగ్లు, డ్యాన్స్లతో వార్తల్లో నిలిచే మల్లారెడ్డి ఈ సారి గొర్రెలను కాసారు. గొర్రెల కాపరి గెటప్లో తళుక్కున మెరిసి అందరి ఆశ్చర్యపరిచారు. మేడ్చల్ మండలం గౌడావెల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమనికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మండలానికి మొత్తం 15 యూనిట్లు కేటాయించామని వాటిలో ఒక్క యూనిట్లో 21 గొర్రెలు ఉంటాయి అని అన్నారు.తెలంగాణలో మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంది అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరి వేషధారణలో గొర్రెలను కాసి అందరినీ ఆకట్టుకున్నారు.