యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పిపల్ పహాడ్ గ్రామం లోని శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవలో భాగంగా దేవస్థానం ఆవరణలో బుధవారం ఉదయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అంతకు ముందు సుమారు 120 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త, కార్యక్రమం నిర్వాహకులు గంగుపంతుల రామచంద్రా రావు ఆధ్వర్యంలో హోమాదులు, శ్రీస్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉదయం 8.24 గం.ని. శుభముహుర్తంలో యంత్రసహిత ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిపించారు.
అనంతరం ప్రధాన ఆలయం గోపురంపై నూతన శిఖర ప్రతిష్టాపన కూడా జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినాన, శ్రీ విష్ణు సహస్రనామం పుట్టిన రోజు సందర్భంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేశారు. ఆలయ నిర్వాహకులు విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు .రేపు శ్రీ రంగనాధస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, 7న ఉదయం హనుమంత సేవ, రాత్రికి గరుడ సేవ కార్యక్రమాలు, 8న సాయంత్రం పొన్న సేవ, అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
9న తెల్లవారుఝామున గం. 5.00 ల నుండి ఉ. గం. 7.00 వరకు శ్రీ స్వామివారి రథోత్సవం జరుగుతుందని నిర్వాహకులు గంగుపంతుల రామచంద్రా రావు తెలిపారు. ఈ మహోన్నత కార్యక్రమానికి గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి మొక్కులు తీర్చుకుని శ్రీ రంగనాథ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు జి. ఇందిర, జి. అమరెందర్ (నాని), కళావైభవం.కామ్ అధినేత కె.ఎల్.నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.