పారిశ్రామిక వేత్త అదానీ కుటుంబానికి వైసీపీ నుంచి వై ఎస్ జగన్ రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది జరుగుతుందనిపిస్తున్నది. అదానీ సతీమణి ప్రీతీ అదానీ ఈ సారి వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టటం ఖాయమైందని పార్టీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. ఏపీ నుంచి జూన్ 21తో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీజేపీ నుంచి సురేశ్ ప్రభు, వైవీ చౌదరి, టీజీ వెంకటేశ్ పదవీవిరమణ చేస్తారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలానికే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సీఎం నివాసానికి వచ్చారు.
తన సహచరుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం చర్చలు చేసారు. ఫలితంగా వైసీపీ నుంచి పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక ఇప్పుడు మరో పారిశ్రామిక వేత్త అయిన అదానీ కుటుంబానికి రాజ్యసభలో అవకాశం కల్పించబోతున్నారని అంటున్నారు. ఇదే జరిగితే అంబానీ.. అదానీ ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన వారు వైసీపీ నుంచి రాజ్యసభలో సభ్యులుగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.