తెలంగాణ సాధన ఉద్యమకారులపై ఉపా చట్టం, తదితర కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు గార్ల మండలంలో వేర్వేరుగా ప్రభుత్వ దిష్టిబొమ్మ లను దగ్దం చేశారు. ఒక వర్గం మండల పరిధిలోని మద్ది వంచ గ్రామంలో, మరో వర్గం మండల కేంద్రమైన గార్లలో సెంటర్ లో దిష్టిబొమ్మ లను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయా వర్గాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య, పౌరహక్కుల కార్య కర్తలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఆచార్య హరగోపాల్, పి ఓ డబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, అరుణోదయ కళా కారురాలు విమల, పౌరహక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్ నారాయణరావు రఘునాథ్, మరో 152 మందిపై మోపిన కేసులను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌని భద్రయ్య, మద్ది వంచ సర్పంచ్ కుసిని బాబు రావు, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జి సక్రు, మాన్య, పి వై ఎల్ మండల కమిటీ అధ్యక్షుడు జగన్, తదితరులు పాల్గొన్నారు.