గృహనిర్మాణ లబ్దిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరలోఉన్న కొండకరకాం రూరల్, అర్బన్ లేఅవుట్లను కలెక్టర్ పరిశీలించారు. అర్బన్ లేఅవుట్లో సుమారు 2,వేల 887 ఇళ్లకుగాను, స్వల్ప సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించి, వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
డివిజన్ల వారీగా అవగాహనా సదస్సులను నిర్వహించి, లబ్దిదారులను చైతన్యపరచాలని చెప్పారు. ఈ లేఅవుట్లో మూడు బ్లాకులకు, ముగ్గురు వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను ఇన్ఛార్జులుగా నియమించి, లబ్దిదారులకు అన్ని విధాలా సహకారం అందించేలా చూడాలని ఆదేశించారు. ఇసుక, సిమ్మెంటు తదితర సామగ్రిని లేఅవుట్లోనే సరఫరా చేయాలని సూచించారు. ఇక కొండకరకాం గ్రామస్తులకు ఇచ్చిన రూరల్ లేఅవుట్లో నిర్మాణాలపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ లేఅవుట్లో మిగిలిపోయిన ఇళ్లను కూడా మొదలు పెట్టేలా చూడాలని ఆదేశించారు.
ఓటిఎస్ కు ఉగాది వరకే గడువు…!
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటిఎస్) అమలుకు ఉగాదివరకే గడువు ఉందని, ఈ పథకం అమలును మరింత వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్ సూర్యకుమారీ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని విజయనగరం మండలం కొండకరకాం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిజిష్టర్లను, వివిధ పథకాల అమలును పరిశీలించిన కలెక్టర్…. ఓటిఎస్ పథకానికి ఇంకా ఎక్కువ సమయం లేనందున, అర్హులంతా దీనిని వెంటనే వినియోగించుకొనేలా చూడాలని సూచించారు.
ఓటిఎస్ వినియోగించుకున్నవారి ఇళ్ల స్థలాలను 22ఏ జాబితానుంచి తొలగించాలని ఆదేశించారు. అవసరమైనవారికి బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించాలన్నారు. చెత్తనుంచి సంపద కేంద్రం పనితీరు, గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు, మహిళలకు, పిల్లలకు రక్త పరీక్షలు, వేక్సినేషన్, 12-14 ఏళ్ల మధ్యవారికి కరోనా వేక్సినేషన్, రీసర్వే, ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద అవసరమైనచోట యుద్దప్రాతిపదికన గ్రావెల్ రోడ్లు వేయాలని, వెంటవెంటనే బిల్లులు పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహశీల్దార్ కోటేశ్వర్రావు, ఎంపీడీఓ సత్యనారాయణ, హౌసింగ్ డిఇ సోమేశ్వర్రావు, ఏఈ రాంప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.