తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడెప్పుడు అరెస్టు చేద్దామా అని చూస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే నాగార్జున ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.
కొద్ది రోజుల కిందట ఇదే కేసు ను తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా పై కూడా పెట్టి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్పై పాత గుంటూరు పోలీసుస్టేషన్లో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రెండు రోజుల క్రితం దళిత విద్యార్థి రమ్య హత్య జరిగిందని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారన్నారు. రమ్య మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేయించి ఆ కుటుంబానికి చెక్ కూడా అందించామని తెలిపారు.
రమ్య మృతదేహాన్ని తీసుకెళ్తుంటే టీడీపీ జెండాలతో వచ్చి లోకేష్ వచ్చే వరకూ ఉంచాలని ఆ పార్టీ నాయకులు సభ్య సమాజం తల దించుకునేలా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇంటి దగ్గర గంటసేపు టీడీపీ నేతలు హడావుడి చేశారన్నారు. వాళ్ల ఇంటికి వెళ్తుంటే తనను చూసి వైసీపీ రౌడీల్లారా అంటూ భయపెట్టే విధంగా లోకేష్ హెచ్చరించారన్నారు. దళిత ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర మనోవ్యధకు గురి చేశాయన్నారు. చంద్రబాబు కూడా ఇదే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
నిన్నటి నుంచి ఆయన వ్యాఖ్యలను జీర్ణించుకులేకపోయానని చెప్పారు. లోకేష్పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు జరిగిన అవమానం దళితులకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నాగార్జున తెలిపారు. దాంతో నారా లోకేశ్పై పాత గుంటూరు స్టేషన్లో 341, 353, 147 r/w, 149 r/w, 120B సెక్షన్ల కింద లోకేశ్పై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, శ్రావణ కుమార్, దూళిపాళ్లతో పాటు పలువురు నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.