రాష్ట్రంలో వ్యవసాయ రైతులను చూసి బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జీ.మణికుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ, ఇటిక్యాల మండల పరిధిలోని జింకలపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యాటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల బాధలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.10 వేలు కాకుండా ఎకరానికి రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా వరి పంటను సాగు చేసిన రైతుల బాధలు వర్ణనాతీతం అన్నారు.
పండించిన ధాన్యంలో మిల్లర్లు 40 కేజీల నుండి 45 కేజీల వరకు తరుగు తీస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్ లలో ఉండి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. స్థానిక నాయకులు, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొనుగోలు కేంద్రాల దగ్గర తరుగు తీయకుండ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వ్యవసాయ రైతులకు పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అవగాహన సదస్సులు పెట్టడం లేదన్నారు. రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రైతుల
సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన అవగాహన సదస్సులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఆకేపొగు బీసన్న,ఆకేపొగు రాంబాబు,రాముడు,నారాయణ,ఆంజనేయులు తదితరులు ఉన్నారు.