తెలుగు దేశం, జనసేన, బిజెపి పార్టీలు ‘ప్రజా గళం’ పేరిట ఉమ్మడి మానిఫెస్టోలో ‘నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూత కల్పిస్తాం ‘ అని పేర్కొనటం పట్ల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
రాజధాని అమరావతికి అండగా ఉన్న కూటమి అభ్యర్థుల విజయానికి బహుజన ఐకాస కృషి చేస్తున్నట్లు, ఈ మేరకు విజయవాడ, గుంటూరు పార్లమెంటు అభ్యర్థులకు, విజయవాడ పర్చిమ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో తాను స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కు అక్షయ పాత్ర వంటిదని, మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి సంజీవని అన్నారు. కూటమి మానిఫెస్టో అమలు జరగాలంటే, అమరావతితోనే సాధ్యం అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి పై కత్తి దూసి ఘోర తప్పిదం చేశారని, రేపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీ నుండి జగన్మోహన్ రెడ్డి జరిగి,జరిగి కింద పడటానికి, అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం అమరావతి ఉద్యమమే అని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.
మానిఫెస్టోలో దళిత త్రిదళ పత్రంకు చోటు
ఉమ్మడి మానిఫెస్టో లో అమరావతి బహుజన ఐకాస మానిఫెస్టో కమిటీకి అందజేసిన దళిత త్రిదళ పత్రంకు చోటు కల్పించటం పట్ల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభినందనలు తెలిపారు. ఎన్నికల ముంగిట్లో తాము రాష్ట్రంలో పర్యటించి ఎస్సీ ,ఎస్టీ లకు సంబంధించి 1. అభివృద్ధి 2. సంక్షేమం 3. భద్రత అనే మూడు అంశాలను పొందుపరిచి ‘దళిత త్రిదళ పత్రం’ పేరిట నివేదిక ఇచ్చామని, అందులోని అంశాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, సబ్ ప్లాన్ నిధుల ఖర్చు, 50 ఏళ్ళకే పింఛన్లు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రూభాయ్, డాక్టర్ అచ్చెన్న హత్యలకు కారకులైన వారిపై శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని మానిఫెస్టో లో పలు అంశాలను పొందుపరిచినట్లు చెప్పారు.