ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, తాను కలుసుకోవడం తప్పు ఎలా అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. పదవి కాలాన్ని కుదించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి రమేష్ కుమార్ ను కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం బయటకు పంపిందని రాష్ట్ర హైకోర్టులో తాను కేసు వేసిన విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేశారు.
హైకోర్టులోనే కాకుండా సుప్రీంకోర్టులో కూడా తాను ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశానని, భారతీయ జనతా పార్టీ అధిష్టానం అనుమతితోనే తాను రాష్ట్ర ఎన్నికల సంఘం అంశాలపై కోర్టులో సవాల్ చేశానని ఆయన అన్నారు. ఈ సందర్భంలో డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను కలవడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.
అదే విధంగా తన పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా వచ్చారని అందులో తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కుట్రపూరితంగా బయటకు పంపి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారు సిగ్గుపడాలని ఆయన అన్నారు.
ఈ నెల 11న సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా డాక్టర్ రమేష్ కుమార్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించారని అయినా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నదని శ్రీనివాస్ అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కోర్టులోనే ప్రస్తావించారని అందువల్ల తాము రహస్యంగా కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంటుందని శ్రీనివాస్ ప్రశ్నించారు.
11న సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా డాక్టర్ రమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని, ఆయనను కలిసింది 13వ తేదీన అని శ్రీనివాస్ తెలిపారు. ఆయన అప్పటికి ఇప్పటికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా లేరని అందువల్ల ఆయన స్వయంగా వచ్చి కలవడంలో ఎలాంటి తప్పు లేదని శ్రీనివాస్ తెలిపారు.