జాతీయ రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని, ఇందుకోసం తాను కాంగ్రె్సలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓవైపు సార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రెస్ ను బలోపేతం చేయడం, ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం దిశగా ఆయన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్ర పోషించే విషయంపై ఆయన ఇటీవల ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలిసి చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పరిచేందుకు ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, కేసీఆర్, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్లతో ప్రశాంత్ కిశోర్కు ఉన్న సంబంధాలతో అందరినీ ఒకే వేదికపైకి ఆయన తీసుకురాగలరని ఈ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అసోం, హరియాణా, జార్ఖండ్లలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తే తప్ప బీజేపీని ఎదుర్కోవడం కష్టమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడడం వల్ల 90 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంటోందని, ఈ నష్టాన్ని కనీసం 50 శాతానికి తగ్గిస్తే కాంగ్రెస్ పోటీలో నిలబడుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల నిర్వహణ, టికెట్ల పంపిణీ, నిధుల సమీకరణ, శిక్షణ, సోషల్ మీడియా విధానాలు, జవాబుదారీతనం, పారదర్శకత, పొత్తుల విషయంలో, పార్టీ నిర్వహణలో సమూలంగా మార్పులు రావాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తనకు ఆ బాధ్యతను అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తానని సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం ఒక బయటి వ్యక్తికి ఇలాంటి బాధ్యతలు కేటాయించి మొత్తం పార్టీని ఆయనకు అప్పగించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయన్న విషయంపై చర్చ జరుగుతోంది.
దీంతో తాను పార్టీలో చేరి అంతర్గతంగా బాధ్యతలు నిర్వహిస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నట్లు తెలిసింది. పార్టీ రూపురేఖలు మారాల్సిన అవసరం ఉందని, అరకొర మార్పులతో సరిపోదని ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న పరిస్థితి రీత్యా పెనుమార్పులే అవసరమని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలపై సోనియా, రాహుల్, ప్రియాంక మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయని, కొందరు జీ-23 నేతలతో కూడా సోనియా ఈ విషయం చర్చించారని తెలుస్తోంది.