ఇప్పటివరకు ఎక్కడ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో కామారెడ్డిలో 11 వ తేదీన జరగబోయే సభను విజయవంతం చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరగబోయే సభకు ఏఐసిసి నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా సభ ఏర్పాట్లను కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ తో కలిసి పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజల వివరాలను కేరళ ఎంపీకి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీకి ప్రతిరూపమైన ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారానికి మొదటి సారి కామారెడ్డికి రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
ఈ సభను కనివిని ఎరుగని రీతిలో విజయ వంతం చేస్తామన్నారు. తెలంగాణలో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల్లో దేశ ప్రభుత్వ రంగ సంపదను అమ్మేశారని తెలిపారు. ప్రజలు కష్టాల పాలై ఆత్మహత్యల పాలయ్యారని, అదాని అంబానీ ప్రపంచ కుబేరులయ్యారన్నారు.
మోడీకి భయం పట్టుకుంది:కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్
ఈ నెల 11 న ఉదయం 9:30 గం.లకు కామారెడ్డిలో జరిగే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ అన్నారు. ఈ సభకు సుమారు 60 వేల నుంచి లక్ష మంది ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి విస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జ్యోస్యం చెప్పారు. సౌత్ ఇండియాలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. ప్రధాని మోడీకి గెలుస్తామో లేదోనన్న భయం పట్టుకుందన్నారు. కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
సత్యం న్యూస్, కామారెడ్డి