ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ సమాధానం చెప్పారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ఓట్లు అడిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి సమాధానం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రత్యేక హోదా ఎజెండాగా సాగిన గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీని తీవ్రాతి తీవ్రంగా విమర్శించింది.
టీడీపీ రాజకీయ అవసరాల కోసం బిజెపి వద్ద మోకరిల్లడం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటిలో తీవ్రంగా విమర్శించారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పినందున వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతారో వేచి చూడాలి.