హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ బల్లెపల్లిలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ లో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో అందరూ భాగస్వాములై అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. మొక్కలు నాటకపోవడం వల్లన గాలిలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, దానిని తగ్గించాలంటే చెట్లు నాటడం ఒక్కటే ప్రత్యామ్నాయం అన్నారు.
ఖమ్మం ఖాళీ స్థలాలు మొత్తం మొక్కలతో నిండాలి
చెట్లు నాటడం వలన సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండుతాయన్నారు. ఖమ్మం నగర పరిధిలో ఖాళీ స్థలాలలో, గ్రామాల్లోని ఖాళీ స్థలాలు పంట పొలాలల్లో ఇరు వైపులా మొక్కలు నాటాలన్నారు. మానవజాతి మనుగడ కొనసాగాలంటే మొక్కలు పెంచడం చాలా అవసరమన్నారు.
హరితహారంపై ప్రణాళికలు చేసుకుని అనుకున్న వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. మొక్కలు నాటడం, నాటించడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని హరితహారం కార్యక్రమంలో పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని లేకపోతే చర్యలు తప్పవనని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, అటవీశాఖ అధికారి ప్రవీణ, అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ మల్లేశ్వరి, కార్పొరేటర్ కొనకంచి సరళ, నాయకులు ప్రసాద్, అటవీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.