జిల్లాలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనాయని, వారికి గుర్తులు కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. ఈనెల మూడవ తేదీ నుండి పదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని, వీరిలో కొందరు అభ్యర్థులు అదనంగా నామినేషన్ దాఖలు చేయగా ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో రద్దు చేయడం జరిగిందని వివరించారు.
15వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమంలో మరో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, ప్రస్తుతం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల 20 వేల 886 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.ఫారం 12 డి క్రింద 80 సంవత్సరాలు పైబడ్డ, పి డబ్ల్యూ డి ఓటర్లకు తీసుకున్న 169 ఓటర్లకు ఇంటి వద్ద నుండే ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో ముందుగా ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి వద్ద నుండే ఓటు వేసే సందర్భంలో అన్ని పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ 30వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు నిర్వహించిన అనంతరం ఓటు వేసిన ఈవీఎం యంత్రాలను భారీ బందోబస్తు మధ్య డిగ్రీ కళాశాలలో రిసీవింగ్ తదుపరి కలెక్టరేట్ కు తరలించడం జరుగుతుందని వివరించారు. వచ్చే నెల మూడో తేదీన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ప్రత్యేక హాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల రోజు ఈవీఎంలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఈసీఐఎల్ నుండి రెండు టీంలను పంపించాలని ఎన్నికల కమిషన్ కోరడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో సమగ్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 15 నుండి బి ఎల్ వో ల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్లు ఓటర్ స్లిప్ లలో ఓటరు తన ఓటు హక్కును ఏ పోలింగ్ స్టేషన్కు వెళ్లి వినియోగించుకోవాలో మ్యాప్, లోకేషన్ సమగ్ర సమాచారం అందులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు, వివిధ పార్టీల నాయకులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో డిపిఆర్ఓ యం. డి.రఫిక్, జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.