కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ దర్శించుకున్నారు. ఎంపి, ఎమ్మెల్యే కు ఆలయ పురోహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కార్తీక మాసం సందర్భంగా చేసిన ఏర్పాట్లు, రానున్న కోటప్పకొండ తిరునాళ్లను పురస్కరించుకుని జరుగుతున్న పనులపై అధికారులను ఆరా తీశారు. పలు పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 15 నాటికి తిరునాళ్ళ పనులు అన్ని పూర్తి కావాలని ఆదేశించారు.
అంతకుముందు నరసరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే దారి పక్కన జరుగుతున్న కల్వర్టు పనులను పర్యవేక్షించారు. ఇసుక సప్లై పై జేసీ తో మాట్లాడి 30 టన్నుల ఇసుకను వెంటనే మంజూరు చేయాలని కోరారు. తిరునాళ్ళ దృష్ట్యా పనులు ఆగడానికి వీలు లేదన్నారు. ఈటి వద్ద రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులు కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కోటప్పకొండ సర్పంచ్ నాగిరెడ్డి, నరసరావుపేట జడ్పీటిసి చిట్టిబాబు, మూరబోయిన శ్రీనివాసరావు, రొంపిచర్ల జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి,రవీంద్ర రెడ్డి, కోటప్పకొండ ఈఓ రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.